సందర్భం:
- పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల, భారతదేశ హరిత ఇంధన పరివర్తన (Green Energy Transition) లోని ఒక ముఖ్యమైన లోపాన్ని బయటపెట్టింది. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాస్తవ విద్యుత్ ఉత్పత్తికి భారతదేశం ఇప్పటికీ బొగ్గు (Coal) పైనే అత్యధికంగా ఆధారపడుతోందని ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్’ (CSEP) విశ్లేషకులు వెల్లడించారు.
విద్యుత్ స్థాపిత సామర్థ్యం మరియు వాస్తవ ఉత్పత్తి మధ్య వ్యత్యాసం:
- స్థాపిత సామర్థ్యం (Installed Capacity) వృద్ధి: గడిచిన రెండు దశాబ్దాలలో భారతదేశ పునరుత్పాదక ఇంధన రికార్డు అద్భుతంగా ఉంది. మార్చి 2005 లో మొత్తం స్థాపిత సామర్థ్యంలో కేవలం 0.72 శాతంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వాటా, మార్చి 2026 నాటికి 42.4 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 58.7 శాతం నుండి 42.2 శాతానికి తగ్గింది.
వాస్తవ ఉత్పత్తి (Actual Generation) లో వెనుకబాటు: స్థాపిత సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధనం 42 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, ఏప్రిల్ 2026 లో వాస్తవ విద్యుత్ ఉత్పత్తిలో దీని వాటా కేవలం 15.8 శాతంగానే నమోదైంది. మరోవైపు, బొగ్గు ఆధారిత ప్లాంట్లు ఇప్పటికీ దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సింహభాగాన్ని అనగా 71.8 శాతాన్ని అందిస్తున్నాయి.
